
గ్రూప్-2 పోటీ పరీక్షలకు ఆగస్టు మూడవ తేదీ గురువారం నుండి మరో మూడు గంటలు అదనంగా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నట్లు టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. గత నెల రోజులుగా ప్రతి రోజు రెండు గంటల ప్రసారాలు అందించిన టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి 10 గంటల వరకు మరో మూడు గంటల అదనపు ప్రసారాలు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. నిపుణ ఛానల్ లో సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇంగ్లీష్, జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ఎకానమి సబ్జెక్టులపై ప్రసారాలుంటాయని, మరుసటి రోజు విద్య ఛానల్ లో తెల్లవారుజామున ఐదు గంటల నుండి 10 గంటల వరకు పున:ప్రసారాలుంటాయన్నారు. గ్రూప్-2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీఎస్పీయస్సీ ప్రకటించడంతో అభ్యర్థులకు మరిన్ని పాఠ్యాంశాలు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు. జూలై మొదటి వారం నుండి రెండు గంటలు ప్రసారాలు అందించిన టి-సాట్ నెట్వర్క్ ప్రస్తుతం అందించే మరో మూడు గంటలు అదనం కానున్నాయని, పరీక్షల సందర్భంగా సబ్జెక్ట్ లపై ప్రత్యేక అవగాహన ప్రసార కార్యక్రమాలుంటాయని సీఈవో శైలేష్ రెడ్డి వివరించారు.