
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల పరిథిలో సాగునీరును తాగునీరును అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9కి (మల్కపేట రిజర్వాయర్ తో పాటు దాని పరిథిలోని కాల్వలకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా ) ‘‘ చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పేరు పెడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, రాజేశ్వర్రావు సామాజిక సేవను స్మరించుకున్నారు. సీఎం మాట్లాడుతూ ‘‘స్వాతంత్ర్య సమరయోధుడుగా, తెలంగాణ మొదటి తరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజలకోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర్ రావు. తెలంగాణ రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వ కోసం ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనది. సిరిసిల్ల వేముల వాడ ప్రాంతాల నుంచి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత ప్రజల సాగునీరు తాగునీరు కష్టాలను తీర్చడానికి ఎత్తి పోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వర్ రావు ఎన్నో పోరాటాలు చేశారు. నాటి వారి ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా స్వరాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నాం. తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారు. వారు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు అందుతున్నది. మిడ్ మానేర్ (ఎస్ ఆర్ ఆర్) నుంచి ఎత్తిపోతల ద్వారా అప్పర్ మానేర్ దాకా నీటి సరఫరా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో… నాటి వారి కృషిని గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ, మల్కపేట రిజర్వాయర్ కు దాని పరథిలోని ఎత్తిపోతల పథకానికి మొత్తంగా ప్యాకేజీ 9కి చెన్నమనేని రాజేశ్వర్ రావు పెట్టడం జరిగింద’’ని సీఎం వివరించారు.