
ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొంత మంది వ్యక్తులు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీని డి ఎస్ సి కి అప్పగించామని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీల విషయంలో తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి పెద్దపీట వేస్తుండటాన్నికాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల్లో విద్యా రంగం అభివృద్ధి కోసం 1 ,87 ,269 కోట్లు ఖర్చు చేశామంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్ధమవుతుందని తెలిపారు.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2017 లో మొదటిసారి 8972 పోస్టులను భర్తీ చేయడం కోసం డీ ఎస్సి నిర్వహించడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రయిమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టులను మరియు 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని అన్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ, నూతన నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీలు ఏమైనా ఉంటె భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గురుకులాల్లో 11 ,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, 12 ,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాద్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ సమయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల ఖాళీల భర్తీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రక్రియను అడ్డుకొనే వారి మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై అనుచిత విమర్శలు చేస్తున్న నాయకుల మాటలను విశ్వసించకుండా నిరుద్యోగులు డి ఎస్ కి సిద్దమై విజయం సాధించాలని ఆకాంక్షించారు.