
భారతదేశంలోని అంతర్జాతీయ ట్రావలర్స్ కు శుభవార్త. ఇకపై వీసాతో పనిలేకుండా కేవలం భారత్ పాస్ పోర్టుతోనే 57 దేశాలను మనవాళ్లు చుట్టిరావచ్చు. వీసాతో పనిలేకుండా మాల్దీవులు, మారిషస్, గ్రెనడినెస్, సెనగల్, కజికిస్తాన్, ఫిజి, భూటాన్, కతార్ మొదలైన 57 దేశాలను సందర్శించవచ్చు అయితే కొన్ని నిర్దిష్ట పత్రాలను మాత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వీసాతో పనిలేకుండా, దానికోసం దరఖాస్తు చేసుకోనవసరం లేకుండానే విదేశాలను చుట్టి రావొచ్చు. అయితే వీసా ఫ్రీ దేశాలలోకి ప్రవేశం సులభమేనా అని కొన్ని అనుమానాలుండవచ్చు. కొన్ని డాక్యుమెంట్లను అక్కడి అధికారులకు చూపిస్తే సరిపోతుంది . వాటిల్లో పాస్ పోర్టుతో పాటు రాను, పోను ప్రయాణ టికెట్లు, ట్రావల్ బీమా వంటివి ఉన్నాయి. అలాగే ఆయా దేశాలలో పర్యాటకులు బస చేసే వసతి వివరాలు, వాక్సినేషన్ సర్టిఫికెట్లు, పాస్పోర్టు సైజు ఫోటోలు, కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్, మూడు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్ వివరాలు, ప్రయాణీకులకు మందుల వినియోగం ఉంటే వాటికి సంబంధించి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లు ఉంటే సరిపోతుంది. తగినంత విదేశీ మారక ద్రవ్యం కూడా దగ్గర ఉంచుకోవాలి. మీరు వెళ్లిన దేశంలోకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రవేశించాలంటే ఆయా దేశాల ఇమ్మిగ్రేషన్ అధికారులు కోరిన పత్రాలను చూపించాలి.
వీసా-ఫ్రీ ట్రావల్ ఉన్న దేశాలలో ఎన్నిరోజులు ఉండొచ్చనేది మరో సందేహం. ఆయా దేశాలు అంతర్జాతీయ ప్రయాణీకులకు నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఒక వారం నుంచి ఆరు నెలల దాకా పర్యాటకులు ఆ దేశంలో ఉండొచ్చు. వీసా-ఆన్ అరైవల్ కి, వీసా-ఫ్రీ ట్రావల్ కి తేడా ఉంది. వీసా-ఫ్రీ ట్రావల్ కు గడువుదాటని పాస్ పోర్టుతో పాటు నిర్దిష్టమైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. విజిటర్ దేశంలోకి ప్రవేశించినపుడు వీసా-ఆన్ అరైవల్ ను జారీచేస్తారు. ఈ కేటగిరీ ప్రయాణీకులు వీసా కోసం ముందొస్తుగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. అయితే ట్రావెలర్స్ తప్పనిసరిగా ట్రావల్ బీమా చేయించుకోవాలి. హెల్త్ కేర్ ఎమర్జన్సీలప్పుడు, బ్యాగేజి పోగొట్టుకున్నప్పుడు, ఫ్లైట్ రద్దు లేదా ఆలస్యం అయినా, ఎక్కువ రోజులు ఏదైనా దేశంలో ఉండాల్సి వచ్చినా అవన్నీ కూడా ట్రావల్ ఇన్స్యూరెన్స్ కింద కవర్ అవుతాయి. బోన్ వోయేజ్!