
కేసీఆర్.. కిషన్ రెడ్డి వేర్వేరు కాదు కేసీఆర్ అనుచరుడు కిషన్రెడ్డి అని టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ పెద్దలు అతడిని అధ్యక్షుడిగా ఎందుకు చేశారో కిషన్రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆదివారం తాజ్కృష్ణ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నాయి అని ఆరోపించారు. అందుకు నిదర్శనమే ఇవాళ ఆ మూడు పార్టీల సభలు, కార్యక్రమాలు అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు అని రేవంత్ విమర్శించారు.
‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇవాళ్టి వరకు ఈడీ, సీబీఐ కాదు.. ఈగ కూడా వాలలేదు. మోదీ, అమిత్ షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ.. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు’’ అని రేవంత్ ప్రశ్నించారు.
కాళేశ్వరాన్ని కేసీఆర్ ఎటిఎంలా వాడుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారన్నారు. కాళేశ్వరం అక్రమ సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టిన బీఆర్ఎస్.. ఆ స్కామ్లో వాటాలు పొందుతున్న బీజేపీ కాంగ్రెస్ను నిందించడం తప్ప ఇంకా ఏం చేయగలదన్నారు రేవంత్ రెడ్డి. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సానుభూతి పవనాలతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారని.. ఎన్నికల్లో గెలిచేందుకు కూతురిని కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలనుకునే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని, ఇందుకు కేసీఆర్ మోదీకి సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ పెట్టిన కేసులో మాత్రమే కవిత ఇరుక్కున్నారని, అంతేగాని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్లకే ఆప్ మంత్రులను జైలుకు పంపితే.. మరి లక్ష కోట్లు తిన్న కేసీఆర్ను ఉరి వేయ్యాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. సోనియా ను,రాహుల్ ను ఈడీ వేధించింది కనిపించడం లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.