
• వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి రైతుల సౌకర్యార్థం వాట్స్ యాప్ సేవలు ప్రారంభం – మంత్రి తుమ్మల
• 8897281111 వాట్స్ యాప్ నెంబర్ ద్వారా పత్తి కొనుగోలు సంబంధిత సేవలు అందించేందుకు సిద్దమైన ప్రభుత్వం –మంత్రి తుమ్మల
పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారి ఆదేశాల మేరకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభించడం జరిగింది.
8897281111 అనే వాట్స్ యాప్ నెంబర్ ద్వారా పత్తి రైతులు, పత్తి కొనుగోలు సంబంధిత సేవలు అంటే రైతు పత్తి అమ్మకం, అర్హత, అమ్మకాల తక్పట్టి వివరాలు, చెల్లింపు స్థితి, CCI సెంటర్ లలో వేచి ఉండే సమయం, కొనుగోలు వివరాలు వంటి అంశాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్స్ యాప్ చాట్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు కలుగుతుందని మంత్రి గారు తెలిపారు.

పింజ రకము(BB MODE) ఒక క్వింటాలుకు రూ.7521/- , (పింజ పొడువు (మి. మీ) 29.5 నుండి 30.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.3) గా, పింజ రకము (BB SPL) ఒక క్వింటాలుకు రూ. 7471/- ( పింజ పొడువు (మి. మీ) 29.01 నుండి 29.49, మైక్రోనీర్ విలువ 3.6 నుండి 4.8) గా, పింజ రకము (MECH) ఒక క్వింటాలుకు రూ 7421/- పింజ పొడువు (మి. మీ) 27.05 నుండి 28.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.7 గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
పత్తిలో తేమ శాతము 12% మించకుండా ఉండి, 8% నుండి 12% మద్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుంది. కావున రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్దారించుకున్న తర్వాతనే ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాల వద్ద అమ్ముకోవాలని మంత్రి గారు సూచించారు.
ఈ పత్తి సీజన్ లో రైతులు వారి పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్నీ రకాల ఏర్పాట్లు చేస్తుందని, రైతులందరు మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన వాట్స్ యాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ప్రయాసలు పడకుండా పత్తిని అమ్ముకోవాలని మంత్రి గారు రైతులని కోరారు. అలాగే రైతులకు ఎటువంటి ఫిర్యాదులున్నా కూడా ఈ వాట్సాప్ చాట్ ద్వారా తెలియపరిస్తే, మార్కెటింగ్ శాఖ వారు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని మంత్రి గారు తెలియజేశారు.