
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా భూమన కరుణాకర్రెడ్డి గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో ని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి తో ప్రమాణ స్వీకారం చేయించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చిన భూమనకు మహాద్వారం వద్ద ఈవో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం భూమన కరుణాకర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత శ్రీ వకుళామాత, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, శ్రీభాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు . రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.
అంతకు ముందు ఆయన తిరుపతిలోని శ్రీతాళ్లపాక గంగమ్మను దర్శించుకున్నారు. అలిపిరి లోని సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించి గో పూజలో పాల్గొని పాదాల మండపంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవరాహ స్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.