
కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానం
సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఆయన ఇంటికి పొంగులేటి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ… ఏ పార్టీలో ఉన్నా తుమ్మల ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తారని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారని… తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్, బీఆర్ఎస్ పద్ధతి ఉందని విమర్శించారు. పొమ్మనకుండా పొగపెడతారని దుయ్యబట్టారు. తనకు చేసిన విధంగానే తుమ్మలను కూడా అవమానాలకు గురి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస పార్టీలో చేరే ముందు తాను తన అనుచరులు, మద్దతుతారులతో చర్చించానని… వారందరి సూచనల మేరకే కాంగ్రెస్ లో చేరానని పొంగులేటి చెప్పారు. తుమ్మల కూడా వారి అనుచరులతో మాట్లాడి, ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చిన పొంగిలేటికి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు నాయకులతో చర్చించిన మేరకే తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల సంక్షేమం కోసం, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం పని చేశానని చెప్పారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తాను అధికారికంగా గోదావరి జలా లతో ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువుల, నీళ్లు విడుదల చేసిన కార్యక్రమంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంట అని ప్రకటించారు.