
గుమస్తా స్థాయి అర్హత లేని వారు గ్రూప్ -1 పరీక్షలను ఎలా నిర్వహిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకే అనర్హులను టీఎస్ పీఎస్సీ బోర్డు మెంబర్లుగా నియమించారని చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై నిరుద్యోగులు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
బోర్డు నియమకాల్లో అనర్హులను నియమిస్తే అల్లకల్లోలం జరుగుతుందని ముందే చెప్పామన్నారు రేవంత్ రెడ్డి. సరైన సూచనలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని.. ఇప్పుడు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
పేపర్ లీకేజీ జరిగినప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు రేవంత్ రెడ్డి. నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత నియామకాలు లేవు అని ఎద్దేవా చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కంప్యూటర్లతో పేపర్లు లీకేజీ అవుతుంటే ఐటీ మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నాడని విమర్శించారు. అవకతవకలపై ఐటీ మంత్రిని అని చెప్పుకుంటున్న కమీషన్ల తారక రామారావు ఏం సమాధానం చెబుతారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ కు పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు, కవితకు సింగరేణిలు ఏటీఎంలుగా మారాయిన రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 1 పరీక్ష విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పబట్టినా.. ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. బోర్డును రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిన బాధ్యత సీఎం పై లేదా? టీఎస్పీఎస్సీ పరిణామాలపై సీఎం ఎందుకు సమీక్ష చేయలేదు? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప, కనీస మానవత్వం లేదన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్… నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి. కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం గానీ.. సరియైన నాయకుడిని తెచ్చుకోలేకపోయాం.. ఇకనైనా నిరుద్యోగులు, యువత ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు. టీఎస్పీఎస్సీ రద్దు కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కమీషన్ల కేసీఆర్. రాజకీయ ఖాళీలు భర్తీ చేసే కేసీఆర్… ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడిన కేసీఆర్ ను గద్దె దించాలి. నిరుద్యోగుల నిరసనతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేయాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కోదండరాం గారు చెప్పినట్లు రహదారుల దిగ్బందానికి మా పూర్తి మద్దతు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. పాలమూరు జిల్లాలో రహదారుల దిగ్బంధం చేసే బాధ్యత తాను, సంపత్ తీసుకుంటామన్నారు. కోదండరామ్ చెప్పినట్టు 14న జాతీయ రహదారులపై బైఠాయిస్తామని పేర్కొన్నారు. పాలమూరు-హైదరాబాద్ రహదారిపై పహార కాస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కోదండరాం గారి నేతృత్వంలో ముందుండి తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తుది దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు రేవంత్ రెడ్డి.