
మేక ఎత్తుకెళ్లాడంటూ యువకుడిని కట్టేసి కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం జరిగినట్టు గా సమాచారం. బెల్లంపల్లి ఎసీపీ పంతాటి సదయ్య కథనం ప్రకారం…పట్టణంలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు–స్వరూప దంపతులతో పాటు వారి కుమారుడు శ్రీనివాస్ కలిసి రైల్వే ట్రాక్ సమీపంలో షెడ్డును ఏర్పాటు చేసుకొని మేకలను పెంచుతున్నారు. ఎనిమిది రోజుల కిందట షెడ్డు నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది. అదే ఏరియాకు చెందిన తాపీ మేస్త్రీ వద్ద కూలీ పనులు చేసే చిలుముల కిరణ్ అనే వ్యక్తి మేకను దొంగతనం చేశాడని ఆరోపిస్తూ శుక్రవారం రాములు కుటుంబసభ్యులు అతన్ని షెడ్డులో కట్టేసి కొట్టారు. డబ్బులు ఇస్తానే విడిచిపెడుతామని చెప్పడంతో తాపీ మేస్త్రీ శ్రావన్ డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి కిరణ్ను విడిచిపించుకొని వెళ్లాడు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కిరణ్ కనిపించకుండా పోయాడని అతని చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం మందమర్రి పోలీస్లకు ఫిర్యాదు చేసింది. కిరణ్ దళితుడు కావడంతో పోలీసులు కట్టేసి కొట్టిన వారిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, టౌన్ ఎస్సై చంద్రకుమార్ పరిశీలించి వివరాలను సేకరించారు. కిరణ్ జాడ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని, కిరణ్ను కొట్టిన నిందితులను ఆదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అయితే తేజ అనే యువకుడి ఫోటో కూడా బయటకు వచ్చింది. ఈ ఫోటో వ్యక్తి పై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. తేజ అనే వ్యక్తి నిందితుల తో కాంప్రమైజ్ అయినట్టు తెలిసింది. అందుకే తేజ కాని ఆయనకు సంబంధించిన వారు ఎవరు కూడా పోలీసులకు పిర్యాదు చేయలేదు.