
జాతీయ సమైక్యతా దినోత్సవంసందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సందేశం – 17వ,సెప్టెంబర్ 2023 జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజలకూ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలనుభారత యూనియన్ లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం 17వ,సెప్టెంబర్ 1948 నాడు సువిశాల భారతదేశంలో అంతర్భాగమయింది. ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా భావించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే,ఈరోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ నేలపై పలుసందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయి.న్యాయంకోసం,ధర్మం కోసం,రాజ్యాంగ హక్కుల సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి,గుండెలు ఎదురొడ్డినిలిచింది తెలంగాణ సమాజం. తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలోకి పరివర్తన చెందాలని ఆనాడు యావత్ తెలంగాణ సమాజం ఘర్షించింది. ఆనాటి ప్రజాపోరాటఘట్టాలు, సామాన్యులు అసామాన్యులైచేసిన త్యాగాలు, జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. దొడ్డి కొమురయ్య నుండి చాకలి ఐలమ్మ దాకా,కొమురంభీం నుండి రావి నారాయణరెడ్డి దాకా, షోయబ్ ఉల్లాఖాన్ నుండి సురవరం ప్రతాపరెడ్డిదాకా, స్వామి రామానందతీర్థ నుండి జమలాపురం కేశవరావు దాకా,బండి యాదగిరి నుండి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథుల దాకా ఎందరెందరోవీరయోధులూత్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వినమ్రంగా నివాళులర్పిస్తున్నాను. ఆసేతు హిమాచల పర్యంతం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చాకచక్యం, మరెందరో నేతల అవిరళ కృషి వల్ల దేశం ఏకీకృతమైంది. నాటి జాతీయోద్యమనాయకుల స్ఫూర్తిదాయక కృషిని సైతం ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకుందాం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకూ హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందింది. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంతప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా తెలంగాణ,ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేయడం,దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవే.అందుకే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి,ప్రజానీకానికీ జరిగిన తీరని అన్యాయాలను,అక్రమాలను, సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి,తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఉద్యమబావుటాఎగురవేశాం. ఆ మహోద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర నాకందించినమహదవకాశం. మీ అందరి సహకారంతో ఉద్యమాన్ని విజయతీరంచేర్చగలిగాను.స్వరాష్ర్టంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం మీరు నా భుజస్కంధాలపైనే మోపారు. తెలంగాణ సాధనతోనే నా జన్మ చరితార్థమైందని భావించాను.ఆ తర్వాత ప్రజల అనుజ్ఞను శిరసావహించి పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో నిర్వహిస్తున్నాను. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటినుంచి జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలుయావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయి. నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని అన్నివర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత,సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావద్దేశంప్రశంసిస్తున్నది. భారతదేశం విభిన్న మతాలు,సంస్కృతులు,జాతులు,భాషలు,కులాలు,తెగల సమ్మేళనం. భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం. జాతీయ సమైక్యత అనేది రాజకీయ,ఆర్థిక,సాంఘిక,సాంస్కృతిక,మనోవైజ్ఞానికి రంగాలకు సంబంధించిన అంశం. జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే,వాటిలో ముఖ్యమైనవి ఆర్థికసమస్యలేనని స్పష్టమవుతున్నది. 76 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాతకూడా ఇప్పటికీ ఆర్థికంగా వెనుకుబాటుతనం,పేదరికం,నిరుద్యోగం,సాంఘిక వివక్షలు మన దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరం. ఈ రుగ్మతలను పారద్రోలటంతో పాటు,ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలిసిందితెలంగాణ ప్రభుత్వం. అందుకే,రాష్ట్ర సత్వరాభివృద్ధితోపాటు,“సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలి” అన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. మానవీయ కోణంలోపథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. సకలజనులకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నది. రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి,తలసరి ఆదాయం పెరిగింది. 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. మరోవంక తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. నిరంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్నిరంగాలనూబలోపేతం చేయడంతోపాటు,అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగాం. “తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది” అన్నమాట అక్షర సత్యం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర పథకాలను అనుసరించడం,తెలంగాణలో సాగుతున్న సుపరిపాలనను తమతమ రాష్ర్టాల్లో సైతం సాగాలని అక్కడి ప్రజలుకోరుకోవడమే ప్రత్యక్ష ఉదాహరణ. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంవల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి ఉంటే,అప్పర్ కృష్ణా,తుంగభద్ర, బీమాఎడమ కాలువ ద్వారా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటువల్ల ఈ అవకాశం పోగొట్టుకున్నాం. పాలమూరు జిల్లాలో అప్పట్లో వ్యవసాయయోగ్యమైన భూమి 35 లక్షల ఎకరాలుకాగా,ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి కేవలం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే. దీంతో పాలమూరు ప్రజలకు బతుకుతెరువుకోసం వలసలే గతి అయ్యాయి. 60 ఎకరాలు భూమి ఉన్నరైతు కూడా పొట్టచేతబట్టుకొని పట్నానికి వలస వచ్చి కూలి పనులు చేసుకునే దుస్థితికి మనందరం కన్నీటి సాక్షులమే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో తెలంగాణ రిటైర్డు ఇంజనీర్లు 2005లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పనచేసి అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇస్తే,ఆనాటి పాలకులు దాన్ని బుట్టదాఖలు చేశారు. జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకున్నవారే లేరు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా,నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో,వివక్షతో తాగునీరు,సాగునీటికి నోచుకోకదశాబ్దాలపాటు ఉమ్మడి పాలమూరు,రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు, నష్టాలు,బాధలు అనుభవించాయి. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను పేరుకు మొదలు పెట్టాలె,ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆపేసి పెండింగులో పెట్టాలె. ఇదీ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి. ఒకనాడు సుసంపన్నంగా వెలుగొందిన పాలమూరులో గంజికేంద్రాలు నడపాల్సిన దుర్గతి పట్టించిన నీచ చరిత్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద ప్రధానంగా దృష్టి సారించింది. పాలమూరు పరిధిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు,బీమా,కల్వకుర్తి,కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. దీంతోఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రారంభమైంది. వలస పోయినోళ్లువాపస్ రావడమేకాదు,పాలమూరులో జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులకు బయటి రాష్ట్రాల నుంచి కూలీలు వలసొచ్చే స్థాయికి పాలమూరును అభివృద్ధి చేసుకున్నం. దృఢ సంకల్పంతో,చిత్తశుద్ధితో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయాలని సంకల్పిస్తే,ప్రతీఘాతుక శక్తులు అడుగడుగునా అడ్డంకులు కల్పించాయి.స్వయానా పాలమూరుజిల్లా ప్రతిపక్ష నాయకులే కొందరు, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వందలాది కేసులు పెట్టారు. అయినా మొక్కవోని పట్టుదలతో,దృఢ సంకల్పంతో పనులు కొనసాగించినం. చివరికి ధర్మమే గెలిచింది. ఎంతో న్యాయపోరాటం తరువాత పర్యావరణ అనుమతులను కూడా సాధించి ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగాం. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ఇన్ టేక్ నుండి నిన్ననే బాహుబలి పంపుద్వారా కృష్ణాజలాలలనుఎత్తిపోసే పంపులను ప్రారంభించుకున్నాం. తెలంగాణ సాగునీటిరంగ చరిత్రలో ఇది మరో సువర్ణాధ్యాయం. నిన్నటిరోజు ఆరు జిల్లాల ప్రజల ఆశలు తీరిన నిజమైన పండుగరోజు. ప్రపంచంలో మరెక్కడాలేనటువంటి అత్యంత భారీ పంపులతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణా ప్రజలకు తాగు,సాగునీటి అవసరాలు తీరనున్నాయి. మనం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారంచేసుకోగలిగాం. కరువు జిల్లాల రైతాంగం కష్టాలు తీరిన పర్వదినంగా నిన్నటి రోజు చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పండుగను గ్రామగ్రామాన పెద్దఎత్తున సంబురాలతో జరుపుకుంటున్నాం. కృష్ణా జలాలలతో ఆయా గ్రామాలలోని దేవతల పాదాలనుఅభిషేకించి మొక్కులు చెల్లించుకుంటున్నాం. పర్యావరణ అనుమతులతోపాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలివ్వడం జరిగింది. మిగిలిన పనులనుచకచకాపూర్తిచేసుకోబోతున్నాం. దీంతో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లా.. మొత్తం 6 జిల్లాల్లోని 12 లక్షల 30 వేల ఎకరాల భూములకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పాలమూరులో ఇప్పటికే పూర్తి చేసిన కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలోని వాగులు వంకల మీద పెద్దసంఖ్యలో చెక్ డ్యాములు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేసి మొత్తం45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకుంటాం. ఖమ్మం జిల్లాలో 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతున్నసీతమ్మసాగర్బ్యారేజీ పనులుశరవేగంగా సాగుతున్నాయి. దీని నుండి నీటిని ఎత్తిపోసే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త, పాత ఆయకట్టు కలిపి 6 లక్షల ఎకరాలకుసాగునీరందుతుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది కనుకదేవాదుల ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకునికరంగా సాగునీరు అందించుకోబోతున్నాం.అంటే రాష్ట్రంలో ప్రధానమైన ఎత్తిపోతల పథకాల ద్వారా 75 లక్షల ఎకరాలకు సాగునీరు లభించనున్నది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తున్నది.రాష్ట్రంలో ఇప్పటికే 85 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. రానున్న మూడు నాలుగేళ్లలో మొత్తం 1 కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. తెలంగాణ రైతన్నల లోగిళ్ళుబంగరు పంటలతోతులతూగుతాయి. “ధ్యేయమును బట్టి ప్రతీ పనీ దివ్యమగును”అన్నదానికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సాధిస్తున్న అద్భుత ఫలితాలే ఉదాహరణ. వైద్యవిద్యలో నూతన విప్లవం – జిల్లాకో మెడికల్ కాలేజీ దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలుఅందించడంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యవిద్యను చేరువచేస్తూ,వైద్యసేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతోరాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నాం. దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్యకళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 8 మెడికల్ కాలేజీలను వచ్చే ఏడాది ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసుకున్నం. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోబోతున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 2017లో ప్రభుత్వం 4 కాలేజీలు ఏర్పాటు చేసింది. అదేక్రమంలో2020లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను మంజూరుచేసుకోగాగతేడాదేవాటిని ప్రారంభించుకున్నం. మొన్న ఒకేరోజున 9 వైద్య కళాశాలలను ప్రారంభించుకున్నాం. దీంతో 26 ప్రభుత్వమెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. 2014 నాటికున్న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 850 ఎం.బీ.బీ.ఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా,నేడు సీట్ల సంఖ్య 3,915 వరకు పెరిగింది. 2014లో ప్రభుత్వ ప్రైవేటురంగంలో కలిపి మొత్తం 2,850 మెడికల్ సీట్లు మాత్రమే ఉండగా,ఇవాళ మూడింతలు పెరిగిపోయాయి. ప్రతిఏటా పదివేలమంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటున్నదని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. రాష్ట్రంలో వైద్యసేవలు మరింత విస్తరించాలని,నిరుపేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నది. వరంగల్ నగరంలో 1,116 కోట్ల రూపాయల వ్యయంతో 2,458 పడకల సామర్ధ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వేగంగా సాగుతున్నది. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. మరో రెండు వేల పడకలతో నిమ్స్ ఆస్పత్రిని విస్తరించుకుంటున్నాం. నూతన భవనాల పనులకు ఈ మధ్య నేనే స్వయంగా శంకుస్థాపన కూడా చేశాను. వీటికితోడు బస్తీ దవాఖానాలు,పల్లె దవాఖానాలు,ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాలు,ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో రోగులకు మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు దఫాలుగా నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో కోట్లాది మందికి దృష్టిలోపాలనుసరిదిద్దగలిగాం. వీటికి తోడు కేసీఆర్ కిట్,కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ గర్భిణీలు,బాలింతలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగడంతోపాటు తల్లీ,పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగాం. క్యాన్సర్,ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులతో అవసానదశకు చేరిన రోగులకోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ యూనిట్లను కూడా నిర్వహిస్తున్నది. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ,చివరిరోజుల్లో రోగులు ప్రశాంత జీవనం గడిపేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. 108, 104 వాహన సేవలకోసం ఇటీవలే అదనంగా 466 వాహనాలను ప్రారంభించాం. దీంతో ఇప్పుడు ఫోన్ చేసిన 15 నిమిషాలలోపు ఈ వాహనాలు వస్తున్నాయి. సకాలంలో వైద్యసేవలుఅందుతుండటంతో ఎన్నో ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం. డబుల్ బెడ్రూంఇండ్ల పంపిణీ గత ప్రభుత్వాలు ఇచ్చిన అగ్గిపెట్టెల లాంటి ఇండ్ల స్థానంలో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా అందించాలన్నది బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నాం. ఇది నిరంతర కొనసాగే ప్రక్రియ. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నాం. పారదర్శకంగా,లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపికచేసి,మహిళల పేరిట ఆ గృహాలను అందచేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే,ఈ పథకం ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది నిరంతరం కొనసాగుతుంది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం‘‘గృహలక్ష్మి” పథకాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహనిర్మాణం కోసం మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. తొలిదఫాలో రాష్ట్రంలోనిప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నాం. పెరిగిన ఆసరా ఆసరా పెన్షన్లు మొక్కుబడిగా కాకుండా,కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలన్నదే ప్రభుత్వ అభిప్రాయం. అందుకే,బీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన వెంటనే రాశిలోనూ,వాసిలోనూ పెన్షన్లు పెంచింది. గతంలో కేవలం 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచుకున్నం. దివ్యాంగులుకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇటీవలే 3016 నుంచి 4016 రూపాయలకు పెంచుకున్నాం. 2014 నాటికి పెన్షన్ తీసుకునేవారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా,ఇవాళ 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చుకుంటున్నం. వృద్ధులు,వింతంతువులు,దివ్యాంగులతోపాటు,ఒంటరి మహిళలు,పైలేరియా బాధితులు,డయాలసిస్ రోగులు,బీడీ కార్మికులు తదితర అన్నివర్గాలవారికి కూడా ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించింది. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. బడుగు,బలహీనవర్గాలఅభ్యున్నతి ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు,సాంఘిక వివక్షకు గురైన బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది. దళితులనుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్నివర్గాలపేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. స్వతంత్రభారతదేశంలోదళితజాతినేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాలలో కొంతమేరకు మేలు జరిగినా,ఆ తర్వాత ప్రయత్నాలు ఆశించినంతగాముందుకు సాగలేదు. దాంతో దళితుల బతుకులుఎక్కడవేసినగొంగళిఅక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం “తెలంగాణ దళితబంధు”. దళిత కుటుంబం తమకు వచ్చిన,తమకు నచ్చిన వృత్తి కానీ,వ్యాపారం కానీ చేపట్టడానికి వీలుగా ఈపథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఇది ఒక నూతన చరిత్ర. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం కాగడా వేసి వెదికినా కనపడదు. దళితులు వ్యాపార రంగంలోకూడా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకొనే లాభదాయక వ్యాపారాలలో వారికి పదిహేను శాతం రిజర్వేషన్లు కూడా కల్పించుకున్నం. షెడ్యూల్డ్ కులాలు,షెల్యూల్డ్తెగలఅభివృద్ధేలక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధిచట్టాన్ని అమలు పరుచుకుంటున్నాం. ఎస్సీ,ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి వారి అభివృద్ధికి నిధులు కేటాయించుకుంటున్నాం. బలహీన వర్గాలలోని వృత్తిపనుల వారికి,మైనారిటీ వర్గాలకు కుటుంబానికి ఒక లక్ష రూపాయల వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నది. వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి,గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నవారికి గొర్రెల పంపిణీ,మత్స్యకారుల కోసం చేపల పెంపకం,నేత కార్మికులకు సబ్సిడీపై నూలు, రంగుల సరఫరా,వారికి పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమా,మద్యం దుకాణాలలో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్,ఈత,తాటి చెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి ఎన్నోకార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. రజకులకు,నాయీబ్రాహ్మణులకుకూడా విద్యుత్ రాయితీ,ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలవేళరాష్ట్రప్రభుత్వం అడవిబిడ్డలకుతీపికబురు అందించింది. ఆదివాసీలు,గిరిజనుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ,పోడు భూములకు పట్టాలందించింది. గిరిజనఆరాధ్య నాయకుడు,జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చినకొమ్రం భీమ్ పేరుతోఏర్పాటయినఅసిఫాబాద్ జిల్లానుంచే ప్రభుత్వం ఈకార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. ఆదివాసీ,గిరిజనులకిచ్చిన పోడుభూములకు రైతుబంధు కూడా అందజేస్తున్నది. పోడు భూముల కోసం జరిపిన పోరాటంలో అమాయక గిరిజనులపై ఉన్న కేసులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఐ.టిరంగం ప్రగతి తెలంగాణలో ఐ.టి రంగం దినదినాభివృద్ధి సాధిస్తున్నది. రోజుకో కొత్త సంస్థ మనరాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేందుకు ముందుకు వస్తున్నది. ఇవాళ ఐ.టి.రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మందిఐటీఉద్యోగులు మాత్రమే ఉండగా,నేడు వారి సంఖ్య 9 లక్షల 5 వేల 715 మందికి పెరిగింది. 2014లో ఐ.టి ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా,నేడది2లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగింది. ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం,వరంగల్,కరీంనగర్,నిజామాబాద్,మహబూబ్ నగర్,సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకొని,ఐ.టి టవర్లు నిర్మించుకున్నాం. మన పల్లెలకు అత్యధిక జాతీయ అవార్డులు పల్లెప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మన పల్లెలు,పట్టణాల రూపురేఖలే మారిపోయాయి. చక్కటి వసతులు సమకూరి, పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి చేతులు మీదుగామన స్థానిక సంస్థలప్రతినిధులు 13 జాతీయ అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణం. పాలనా సౌకర్యం కోసం కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు,మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు, కొత్త పంచాయతీలు,అవసరాన్నిబట్టి కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిజిల్లా ప్రధానకేంద్రంలో జిల్లా సమీకృత కార్యాలయాలు,జిల్లా పోలీసు కార్యాలయ భవనాలు నిర్మించుకుంటున్నాం. దీంతో ప్రభుత్వ పాలన ప్రజలకు దగ్గరైంది. విశ్వనగరంగాహైదరాబాద్ హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాలు,అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలసిమెలసి బతుకుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశాం. గతంలోలాగా మత కల్లోలాలు,గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. పారదర్శక పరిపాలన నిరంతర విద్యుత్తూ వంటి కారణాలతోఅనేక అంతర్జాతీయ కంపెనీలుమనరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి,సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి,పూర్తిచేస్తున్నాం. ఈ ఎస్సార్డీపీ పనులతో నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయస్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశాం. హైదరాబాద్ నడిబొడ్డున,హుస్సేన్ సాగర్ నదీ తీరంలోనూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం,అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ నగరం నలువైపులా69వేలకోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నది. విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నది. సంతోషాల సాగుబడి కాళేశ్వరంవంటి భారీ ఎత్తిపోతలప్రాజెక్టుతోపాటు,మిషన్ కాకతీయ,పెండింగ్ ప్రాజెక్టులనిర్మాణం,ఇతర మధ్యతరహా,చిన్న ప్రాజెక్టుల పూర్తితదితర పనులతోతెలంగాణసాగునీటిరంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్,సకాలంలో విత్తనాలు,ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబంధు,రైతుబీమా, 37వేల కోట్ల రూపాయల వరకూ పంటరుణాల మాఫీతదితర సంక్షేమ చర్యలు రైతన్నకు ఊరటనిచ్చాయి. వ్యవసాయం పండుగగామారింది. సాగుబడిలో,దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తున్నారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. వరి ఉత్పత్తిలో పంజాబు రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంవైపు తెలంగాణ పరుగులు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గానూ కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తిచేసే కృషిలో పూర్తిగా నిమగ్నమై ఉంది బి ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నింటా నంబర్ వన్ తెలంగాణ నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి,అన్ని రంగాలకూ 24 గంటల పాటు,వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్. 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. ఇవాళ మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన,సురక్షితమైన తాగునీరుని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్నవయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకుదూసుకుపోతున్నాయి.ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా,ఎవరినోటవిన్నాతెలంగాణ మోడల్ మార్మోగుతున్నది. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదు. మన సమైక్యతేమనకు బలం. ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారుతెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దాం.. యతో ధర్మ స్తతోజయః జైతెలంగాణ.. జైభారత్